Monday, April 19, 2010

భావి రచయిత

అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు ఏడుగురు వేట కి వెళ్లి ఏడు చేపలు పట్టేరు, అందులో ఒక చేప ఎండలేదు. ఇలా చెప్పసాగింది అరుణ తన నాలుగేళ్ల కొడుకు రఘు కి. వాడు ఆ కధ చాలా సర్లే విన్నాడు. కాని వాడికి రోజు పడుకునే ముందు అమ్మతో కధలు చెప్పించుకోవడం అలవాటు. విన్నకధైన మళ్లీ మళ్లీ వింటూ వుంటాడు. " నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే కుట్టనా" అంటూ కధ ముగించింది.
ఇక పడుకో నాన్నా అంది. అమ్మ నేను ఒక కధ చెబుతా అన్నాడు రఘు. అరుణ కి నవ్వు వచ్చింది.
వాడేమి మాట్లాడినా అరుణ విసుక్కోదు. వాడంటే పంచ ప్రాణాలు ఆమెకు. పైగా వాడు పుట్టేకా ఒకటిన్నర సంవత్సరాల వరకు వాడికి మాటలు రాలేదు. వాడు ' అమ్మా' అని ఎప్పటికైనా అంటాడా అని ఏంటో బాధపడుతూ వుండేది. వాడి తోటి పిల్లలంతా ' కాకి, పిల్లి, ఫ్యాన్' అంటూ ఎనిమిదవ నెలనుంచే మాట్లాడుతూ వుంటే, చాలా ఆలస్యంగా మాట్లాడుతూ వుండడం వలన, వాడేమి మాట్లాడినా అపురూపంగా వుంటుంది అరుణకి.
"సరే చెప్పు" అంది.
చెప్పడం మొదలు పెట్టాడు. ' అనగనగా ఒక రాజు వున్నాడు. ఆయనకి ఒక కొడుకు వున్నాడు. ఆ కొడుకు ఒక రోజు వేటకి వెళ్లి ఒక చేపని పట్టేడు." అంటూ మిగతా కధంతా మామూలే. ' నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా' అంటూ ముగించాడు.
అరుణకి నవ్వు వచ్చింది..అవును నిజమే కదా. ఏడుగురు కొడుకులు ఈ కాలంలో ఎవరికీ వుండడం లేదు. పైగా, ఎండని చేప ఒకటే కదా, కధ పూర్తి చెయ్యడానికీ ఒక చేప చాలు అని నవ్వుకుంటూ, ఈ నాలుగేళ్ల వాడికి ఈ కధని ఇలా తిరిగి చెప్పే విధానం చూసి ఆశ్చర్య పోయింది. ఒకటి, కధని పూర్తిగా అర్ధం చేసుకోవడం, రెండవది, అందులోని అనవసర విషయాలని తొలగించేసి ఒక విధం గా ఎడిట్ చేసి చెప్పడం. ఏమిటి పిల్లవాడు అని నవ్వుకుంది. కొంతసేపటికి బాబు నిద్రపోయాడు.
వార్తలవగానే బెడ్రూం కి వచ్చిన అరుణ భర్త రాజా కి ఈ కధ విషయం చెప్పింది. ఈ కాలం SMS యుగం. అందుకే వాడు షార్ట్ కట్ చేసేసాడు అంటూ నవ్వాడు రాజా.
మర్నాడు, అరుణ, రఘు కి మరో కధ చెప్పడం మొదలు పెట్టింది.
' ఒక వర్తకుడు కొన్ని టోపీలు తీసుకుని ఒక అడవిలోంచి వెళ్తున్నాడు. ఒక చోట చెట్టుకింద తానూ తెచ్చుకున్న రొట్టెలు తిని, నిద్ర పోయాడు. అంతలో కొన్ని కోతులు వచ్చి ఆ టోపీలని ఎత్తుకు పోయాయి."... చివరకి ఆ టోపీలన్ని మూట కట్టుకుని ఆ వర్తకుడు ' బ్రతుకు జీవుడా' అంటూ పారిపోయాడు, అంటూ ముగించింది. చప్పట్లు కొట్టాడు రఘు.
ఇప్పుడు నేనొక కధ చెపుతా అంటూ మొదలు పెట్టాడు. “ఒక వర్తకుడు వున్నాడు. వాడు కొన్ని చెప్పులు మూట కట్టుకుని అడవిలోకి వెళ్ళాడు”. తాను చెప్పిన కధే టోపీలని చెప్పులుగా మార్చి చెప్పేస్తూ వుంటే, నవ్వుతూ వింటున్న అరుణని చూసి , ' ఏమనుకున్నవోయ్ , మనకేమి ధోకా లేదు. వీడు ఒక గొప్ప రచయిత అయే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
అని పక పకా నవ్వాడు రాజా.

No comments:

Post a Comment