Monday, June 14, 2010

ప్యాస్సెంజెర్ ట్రైన్లో ప్రయాణం.

ప్యాస్సెంజెర్ ట్రైన్లో ప్రయాణం.
చాలామంది ప్రయాణం అంటే విసుక్కుంటూ వుంటారు. నాకుమాత్రం భలే సరదా. చిన్నప్పుడు ఎప్పుడు బస్సు లోనే ప్రయాణం చేసేవాళ్ళం. నా చదువు పూర్తయ్యాకా, వుద్యోగంలో చేరేక, నా ట్రైన్ ప్రయాణాలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను చెప్పబోయె ప్యాస్సెంజెర్ ప్రయాణం చాలా కాలం క్రితం జరిగిందిలెండి. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. అప్పటికి ఆంధ్రాలో టివి యే రాలేదు. గవర్న్మెంట్ కాలేజీ లో జూనియర్ లెక్చురెర్ గా పని చెస్తూవుండే దాన్ని. మేము విశాఖపట్నం లో వుండేవాళ్ళం. దగ్గరగా వున్న యలమంచిలో నాకు పోస్టింగ్ వచ్చింది. రోజూ పొద్దున్నే ఎనిమిది గంటలకి సింహాద్రిఎక్స్ ప్రెస్స్ ఎక్కి, సయంకాలం అదె ట్రైన్ లో వెనక్కి తిరిగి వచ్చేదాన్ని. ఆ ట్రైన్ విశాఖపట్నం రాజమండ్రి మధ్యన షట్ట్ ల్ ట్రైన్. తరవాత ఆ ట్రైన్ ని విజయవాడ, గుంటురు దాక మార్చినట్టు గుర్తు. ట్రైన్ ప్రయాణమైతే అసలు ప్రయాణం చెసినట్టు వుండదు. భలే కాలక్షేపం కూడా. ఫెద్ద కిటికీలు, విశాలంగా కూర్చోవచ్చు. బాత్ రూం సౌకర్యం వుంటుంది. కట్టుకున్న చీర నలిగిపోదు. ముప్పయ్ నిముషాల్లో అనకాపల్లి చేరితే, మరో ఇరవై అయిదు నిముషాల్లో యలమంచిలిలో దిగేదాన్ని. ఫది గంటలకల్లా కాల్లేజ్ చేరుకునేదాన్ని. పెద్ద అలసటగా కూడ వుండేదికాదు.
పొద్దున్నే లేచి, బాక్స్ లో కూర అన్నం, మజ్జిగ అన్నం పాక్ చేసుకుని వెళ్ళేదాన్ని. రైల్వే స్టేషన్ కి బస్ మీద పది నిముషలలో వెళ్ళొచ్చు. లేదా, రిక్షా లో కూడ వెళ్ళొచ్చు. ఒక మైల్, మైలున్నర దూరం వుంటుంది. కాల్లేజ్ లో పాఠాలు చెప్పడం కన్నా, ఏ ట్రైన్ ప్రయాణం చాలా ఎక్సైటింగ్ గా వుండేది నాకు. రోజు కొంతమంది నాతొ అదే ట్రైన్లొ ప్రయాణం చేసేవారు. మా కాల్లేజ్ లోనె పని చేస్తున్న బోటని లెక్చురెర్ సత్యన్నారయణ గారు, మా కాల్లేజ్ లైబ్రేరియన్ వెంకటేష్, అదే వూళ్ళొ ఎదో గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తున్న మరో నలుగురు వుద్యోగస్తులు అంతా ఒకె కంపార్ట్మెంట్ లో వెళ్ళేవాళ్ళం. ఫ్రతి నెలా మంథ్లీ పాస్ తీసుకునేవాళ్ళం. రెగ్యులర్ పాస్సెంజెర్స్ ఏ ట్రైన్లోనైన ఎక్కొచ్చు. రొజూ వాళ్ళందరి కబుర్లు వింటూ వుంటే న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరమే వుండేది కాదు.
యలమంచిలి స్టేషన్ నుంచి ఓక పది నిముషాలు నడిస్తే, కాల్లేజ్ లొ వుండేవాళ్ళం. కొంతమంది స్తూడెంట్స్ అనకాపల్లి నుంచి వచ్చేవారు. అక్కడ సీట్ రానివాళ్ళు యలమంచిలి కాల్లేజ్ లో చేరేవాళ్ళు. యలమంచిలి కాల్లేజ్ హాకీ టీం కి ప్రసిద్ధి. రోజూ ట్రైన్లో ఎక్కే వాళ్ళ హడావిడి, వెళ్ళొస్తానమ్మా.. అలాగే, వెళ్ళగానే వుత్తరం రాయి, అందరిని అడిగేనని చెప్పు.. బాగా చదువుకో.. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి.. సామాన్లు జాగ్రత్త… ఇలాంటి సంభాషణలతో పాటు, కాఫీ.. కాఫి,చాయ్.. చాయ్.. ‘విశాఖపట్నం నుండి రాజమండ్రి పోవు… . సింహాద్రిఎక్స్ ప్రెస్స్. మూడవ నంబరు ప్లాట్ ఫాం నుంచి బయలుదెరుటకు సిద్ధముగా వున్నది.. లాంటి అనౌన్స్ మెంట్స్…. చాలా మందికి విసుగ్గా అనిపించినా, నాకు మాత్రం శ్రవణానదం గా వుంటాయి. వేరు శనగలు అమ్మేవాడు, సమోసాలు అమ్మేవాడు, కీరా ముక్కలు అమ్మేవాడు.. కంపర్ట్ మెంట్లు కూడా హడావిడిగా వుంటాయి. పొద్దున్నే ట్రైన్లో అంతమంది వుండరులెండి.. నాకు మాత్రం ట్రైన్ ప్రయాణం ఎంత ఇష్టమో చెప్పలేను.
ఒకసారి ఎమైందో తెలుసా?
రోజులాగే ఆ రోజూ కాల్లేజి కి వెళ్ళేను. కాల్లేజ్ అయిపొయాకా సాయంత్రం స్తేషన్ కి వచ్చాను. కొందరు స్టూడెంట్స్, బోటని లెక్చురెర్ గారు, అంతా బెంచ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మరో పావుగంటలో ట్రైన్ రావాలి. నా కోసం కొందరు స్టూడెంట్స్ జాగా చేస్తే కూర్చున్నా. ట్రైన్ వచ్చే సూచనలేమి కనిపించలేదు. అయిదు పదిహేను కి రావలి. ఆరున్నర వరకు వచ్చేస్తోందని ఎదురు చూసాము. అనౌన్స్ మెంట్ కూదా లేదు. చిన్న స్టేషన్. పెద్దగా హడావిడి కూడ వుండదు. ఎదురుగా కొండలు, పక్కనే పొలాలు.. పచ్చగా.. చూడడానికి అందం గానె వుంటుంది… కాని ఎంతసేపని అనందిస్తాము? . సరే సంగతేమితో కనుక్కోమని, ఒక స్తూడెంట్ ని స్టేషన్ మాస్టర్ దగ్గరకి పంపాము.ఎక్కదో ఏదొ ప్రొబ్లెం ట, ట్రైన్ లేట్. మేము చూస్తూ వుండగానే, కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఝామ్మని వెళ్ళిపొయింది. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఇలాంటి చిన్న స్టేషన్స్ లో ఆగదు. ఏమిచేద్దామురా దేముడా అని..అందరం గాభరా పడసాగేము.
రాత్రి ఎనిమిది అయింది. ఈ లోగా.. చిన్నప్పుడు చదువుకున్న పాటలా ఛుక్ చుక్ రైల్ వచ్చింది… దూరం దూరం జరగండి అన్నట్టు ఒక ట్రైన్ వచ్చింది . ఆది మేమనుకున్నట్టు సింహద్రి ఎక్స్ ప్రెస్ కాదు . అది ఒక ప్యాసెంజర్ ట్రైన్. కూరగాయల వాళ్ళు, చేపల బుట్టల వాళ్ళు.. చాలా మంది రోజూ చిన్న చిన్న వ్యాపారస్తులు అందులో చిన్న చిన్న వూళ్ళనుంచి ప్రయణం చేస్తారు. చాలా కిక్కిరిసి వుంది. అందులో చాలా ట్రైన్స్ రాలేదెమో , మరీ కిట కిటలాడుతోంది . నాతో వున్నవాళ్ళు అందరూ ఎక్కేసారు. ఎక్కాలా, వద్దా.. అని ఆలోచిస్తున్నా. స్టేషన్ మాస్తర్ మరో గంత వరకు సింహద్రి ఎక్స్ ప్రెస్ రాదు అన్నాడు. అందరు నన్ను చూసి, మేడం గారు, ఒక్కరే వుండిపొతారు. మీరు ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూసే లోపల, మేమంతా వైజాగ్ వెళ్ళిపోతాము, రండి ఎక్కండి అని తొందర పెట్టారు. ఈ లోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. నేను ఒక్కదాన్ని అక్కడ వుండిపోవడం ఇష్టం లేక, వాళ్ళతో ఎక్కేసాను. ట్రైన్ వానపాములా మెల్లగా కదిలింది. చచ్చామురా దేముడా కాని ఇది వైజాగ్ వరకు ఇలాగే వెళ్తుందా అనుకుంటున్న సమయం లో, మెల్లగా వేగం పుంజుకుంది. ఛల్లగా గాలి కూడ వీస్తోంది
ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అబ్భ ఇంటికి వెళ్ళగానే, అన్నయ్య సుత్తి వినాలి. నేను ముందే చెప్పాను, దీనికిపెళ్ళి చేసేయండి ఆసలు దీనికి చదువులు వుద్యోగాలు ఎందుకు .. అంటూ మొదలెడతాడు. నాన్నగారు మంచి వారు. ఆయనకి నా మీద చాల నమ్మకం, ప్రేమ. అన్నయ్య కన్న నేనే స్మార్ట్ అని ఆయన అభిప్రాయం.. పాపం అమ్మ. ఈ పాటికి , ఆ వెంకటేశ్వరుడికి రెండో మూడో కొబ్బరికాయలు మొక్కుకునే వుంటుంది.ఫర్వాలేదులే. ఇంకెంత, ఓ గంటలో ఇంట్లో వుంటా. తప్పు నాది కాదు , రైల్వే డెపార్ట్ మెంట్ ది ఇలా వున్నాయి నా ఆలోచనలు. ఇంతలో ట్రైన్ స్లో అయినట్టు అనిపించింది. అనిపించడమేమిటి నా మొహం, స్లో గా ఆగింది. అప్పుడే అనకాపల్లి వచ్చేసిందా? అరే, ఎక్స్ ప్రెస్ కన్నా పాసంజెర్ ట్రైన్ బాగుందే అనుకున్నా. కాని తెలిసిందేమిటంటే ఆ వచ్చింది నరసింగపల్లి స్టేషన్ అని. అక్కడ పాసెంజెర్ కి అఫీషియల్ స్టాప్. ఇదేమిటి, ఇదో వూరు వున్నట్టే నాకు తెలియదు అన్నాను. అంతా నన్ను చూసినవ్వేరు. కంగారు పడకండి. తొందరగానే బయలుదేరుతుంది అన్నారు. కొంతమంది మనుషులు, కొన్ని బుట్టలు, కొన్ని బస్తాలు దిగాయి. కూర్చుందుకి చోటుదొరికింది . బతుకు జీవుడా అని కూర్చున్నాము. అంతకన్న చేసేదేముంది లెండి. ఒక పది నిముషాలు అఫీషియల్ స్టాప్ మరో పదిహేను నిముషాలు అన్ అఫీషియల్ స్తాప్ తరవాత ట్రైన్ కదిలింది. అమ్మయ్య అనుకున్నా.. మరో పది నిముషాలు కాకుండానే మళ్ళీ ఆగింది. కసింకోట స్టేషన్ ట. ఓహో, ఇదొకటి వుంది కదూ అనుకున్నా. బస్ లో వచ్చేటప్పుడు ఈ స్టాప్ సంగతి తెలుసు లెండి. అక్కడ ఒక పావుగంట ఆగింది.
మరో పావుగంట తరవాత అనకాపల్లి చేరుకున్నాము . అక్కడ ట్రైన్ అరగంట ఆగింది. ఈలోగా మేము రోజు వెళ్ళే సింహాద్రి ఎక్స్ ప్రెస్ మరో పది నిముషాలలో వస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వినిపించింది. నేను వెంటనే అక్కడ దిగిపోతానని చెప్పాను. ఈలోగా మా ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. వాళ్ళంతా, నన్ను చూసి నవ్వడం మొదలు పెట్టారు. మేడం గారూ రేపొద్దున్న, ఇదే అనకపల్లి లో మిమ్మల్ని కలుస్తాము. మేమంతా ఇవాళ ఈ పాసంజర్లో వెళ్ళిపోతాము. మీరు మాత్రం ఇక్కడే వుండంది అని. నాకు ఒక్కదాన్ని వుండడానికి భయం వెసింది. ఇక దిగే ప్రయత్నం మానుకుని, లేచిన దాన్ని మ ళ్ళీ కూర్చున్నా. కదులుతున్న ప్యాసంజరు లోంచి ఒకరిద్దరు మాత్రం ఆఖరి నిముషం లో దిగేసారు.
ప్యాసంజరు బయలు దెరింది. మరో పావుగంటకి మ ళ్ళీ కధ మొదలు. పూర్తిగా కూడా వేగం అను కోలేదు. మ ళ్ళీ స్లో అయి, ఆగిపొయింది. దువ్వాడ స్టేషన్ ట. అక్కడ అంతా దువ్వాడ గురించి చెప్పడం మొదలెట్టారు. ఫ్యూచర్ లో వైజగ్ బదులుగా దువ్వాడ మైన్ స్టేషన్ గా మారుతుందని, చాలా డవలప్ అవుతుందని, స్థలాలు కొనుక్కుంటే, చాలా లాభం వస్తుందని, అక్కడే రేడియొ స్టేషన్ కూడా వుందని. ఇలా ఎన్నో కబుర్లు. ఈలోగా మా ట్రైన్ కదల లేదు కాని సింహద్రి ఎక్స్ ప్రెస్ మాకళ్ళ ఎదురుగానే వెళ్ళిపోయింది. నాకు ఏడుపు వచ్చింది. కాని వాళ్ళందరి ముందు ఏడవలేను కదా?
ఆతర్వాత ఏమయిందంటారా? ఏముంది.. గోపాలపట్నం , మర్రిపాలెం అఫిషియల్ స్టాప్స్, కంచరపాలెం అన్ అఫిషియల్ స్టాప్ లతో , మరో రెండు గంటల తరవాత, మెల్లగా.. రాత్రి (రాత్రి అనాలో పొద్దున్న అనాలో?) ఒంటిగంటన్నరకి మెల్లగా వైజాగ్ స్టేషన్ పాసెంజరు చేరుకుంది. సిటి బస్సులు లేక, రిక్షా దొరక్క, చీకటిలో, ఒక్కదాన్ని ఇంటికి నడుచుకుని చేరుకున్నా .. ఇంట్లో అంతాలేచి, నాగురించి ఎలా కనుక్కోవాలా అని సతమతమౌతు, నిద్ర పోకుండా అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇక ఏముంది.. మిగతాది మామూలే.. దీనికి పెళ్ళి చేసేయండి.. అంటూ అన్నయ్య.. వెంకటేశ్వరా అంటు అమ్మ, అక్కా, నాతో ఆంజనెయస్వామి గుళ్ళో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యాలే.. అంతు బిక్క మొహం వేసుకుని చూస్తున్న చెల్లెలు… మళ్ళీ మర్నాడు.. మామూలే.

No comments:

Post a Comment