Monday, July 19, 2010

నీ కొండకు నీవే రప్పించుకో !

ఇందుగలడందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూసిన, అందందే గలడు, దానావాగ్రిణి వింటే.
ఎంత అందంగా, ఎంత సులభంగా,చెప్పెసాడో కదా ప్రహ్లాదుడు? ఎక్కడ బడితే, అక్కడే దొరుకుతున్న ఆ దేముని కోసం, మనం ఇంట్లోనే కూర్చుని ప్రార్ధించు కో వచ్చు కదా? ఈ మధ్య మురళి గారి తేటగీతి లో "పుణ్యం కావాలా, ఐతే" ( http://tetageeti.wordpress.com/2010/07/16/punyam_kaavaalaa/) చదివేకా, నా జీవితంలోని ఈ అనుభవం గురించి రాయాలని మరీ మరీ అనిపించింది.
ఒకసారి మా అబ్బాయికి హెపిటైటిస్ బి ఇంజేక్షన్స్ రెండు ఇచ్చాకా, మూడవ ఇంజెక్షన్ కి మరొక నెల టైం వుంది కదా, అని ఈ లోగా, తిరుపతి దర్శనం చేసుకుని రావచ్చని నేను, మా ఆయన, బాబుతో బయలు దేరాము
.
ఎప్పటి లాగానే, మమ్మల్ని వైకుంఠం దగ్గర వదిలెసి, యెవరో పరిచయం లేని యాత్రికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ, వారికి దారి చూపిస్తూ, ఉచిత సలహాలు ఇస్తూ, తను తప్పిపోయి మేమేదో తప్పిపోయి నట్టు మమ్మల్ని వెదుక్కుంటూ కల్యణ కట్ట దగ్గర తేలేరు. అక్కడ, ఆయన ఒక వ్యక్తి వాంతులు చేసుకుంటూ కనిపించాడు. ఈయన, మా సంగతి పూర్తిగా మరచిపోయి, ఆ వ్యక్తిని గమనించి, అతని ఆరోగ్య పరిస్థితి కొంచం సీరియస్ గా అనిపించి, గబగబా, దగ్గరనే వున్న కొందరు వ్యక్తుల సహాయంతో, అశ్వని హాస్పిటల్ కి ఫోన్ చేసి, అంబులెన్సు తెప్పించారు. ఆ హాస్పిటల్ వాళ్ళు మా ఆయన్ని కూడా ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. ఒక గంట అక్కడ వుండి, అతనికి ప్రాణ భయం లేదని నిర్ధరించుకున్న తరవాత, తిరిగి, మాకోసం వెదకడం మొదలు పెట్టారు. మేము ధర్మ దర్శనం కోసం "వైకుంఠం" వెళ్లి ఉంటామని గుర్తుకు వచ్చి, ఎలానో ఓలాగ మమ్మల్ని చేరుకున్నారు,

"హమ్మయ్య వచ్చేసారా" అని గాభరా పడుతున్న నన్ను చూసి, జరిగింది చెప్పారు. "పోనీ లెండి, మంచిపనే చేసారు" అని క్యూ కాంప్లెక్స్ లో చేరాము. అక్కడ ఓ నాలుగు గంటలు ఆ జైలు లో కూర్చున్నాము. .. (భక్తులు క్షమించాలి, జైలు అన్నందుకు. అవి నాకు జైళ్ల లాగే కనిపిస్తాయి. ఒక రకంగా, మనం పూర్వం చేసిన పాపాలకి, ఆ విధంగా దేముడు మనకి ఒక రకంగా శిక్ష వేసి, పాపాలు తగ్గిస్తున్నా డేమో అని పిస్తుంది. అందుకే నేమో, మన పాప భారం కొంచం తగ్గి, దేముడు మనకి కొంచం పుణ్యం ఇస్తాడు.) అంత సేపూ అటు ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్న మా బాబు సడన్ గా, నా దగ్గరికి వచ్చి నా వళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. వళ్ళు కాలిపోతోంది. చాలా జ్వరం వచ్చేసింది. నా బాగ్ తీసి, పారాసెట్ మాల్ టాబ్లెట్ ఒకటి వేసాను. ఎంతకీ జ్వరం తగ్గలేదు. ఎందుకో అనుమానం వచ్చి వాడి కళ్ళు విప్పి చూసాను. కళ్ళు పచ్చగా వున్నాయి. ఆయనకి చూపించి, ఇదేమిటి, మనం రెండు హెపిటైటిస్ బి ఇంజేక్షన్స్ ఇచ్చాము కదా, అయినా కళ్ళు ఎందుకు పచ్చగా ఉన్నాయేమిటి అని అడిగాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఆయన వెంటనే, పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నారు. నాలుగు గంటలు కూర్చున్నాము కదా, మరి రెండు మూడు గంటల్లో వెళ్లి దర్శనం అయిపోతుంది వుండండి, అదే తగ్గి పోతుంది అంటూ చుట్టూ పక్కల వాళ్ళు సలహా ఇచ్చారు. మా అయన, మమ్మల్ని కాంప్లెక్స్ లో బంధించిన అక్కడి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పారు. వాళ్ళు, ఫరవాలేదు. "మీరు వెళ్ళండి. మేము మీకు స్పెషల్ గా దర్శనం ఇప్పిస్తాము" అని చెప్పారు.
మేము వెంటనే, కాంప్లెక్స్ లోంచి వెళ్లి పోయి అశ్వని హాస్పిటల్ కి వెళ్ళాము. వాళ్ళు మా అబ్బాయిని చెక్ చేసి, " పిల్లవాడికి బాగోలేదు. కొండ మీద వుండకండి, వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి, దర్శనం అయిందా అని అడిగాడు. ఇంటికి వెళ్లిపోతాము, మాకు దర్శనం అక్కర లేదు అని చెప్పాము. కానీ, ఆ డాక్టర్ " అలా చెయ్యకండి.. తరవాత, మీకు మనసులో చాలా పీకుతూ వుండి పోతుంది. కనుక స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి" అన్నాడు". వైకుంఠం దగ్గరకు వెళ్ళగానే, మమ్మల్ని బయటికి వదిలిన వ్యక్తి మమ్మల్ని గుర్తుపట్టి, లోపలికి డైరెక్ట్ గా వెళ్తున్న వాళ్ళలో కలిపి గుడి లోనికి పంపాడు.. మేము స్వామి వారి దర్శనం చేసుకుని, వెంటనే, కొండదిగి విశాఖపట్నం చేరుకున్నాము. భగవంతుని దయవల్ల మా వాడు కూడా బాగానే వున్నాడు.
కానీ, మనస్సులో అనుకున్నాను.. నా భర్త కానీ, నా కొడుకు కాని, ఒక పెద్ద పదవి లోకి వెళ్లి, మాకు తిరుపతిలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు జరిగితేనే కానీ మళ్ళీ తిరుపతి వెళ్ల కూడదు అని నా మనస్సులో అనిపించేసింది. అంతే ఆయన వుండడం పెద్ద పదవి లోనే వున్నారు, ఎటొచ్చీ గవర్నమెంట్ లో కాదు ప్రైవేటు సెక్టార్ లో. . అలానే, ఆయనకి కూడా, "నీ కొండకు నీవే రప్పించుకో , నేను ప్రయత్నం చెయ్యను" అని మనస్సులో గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.
ఇది జరిగి రెండు నెలలు కాలేదు, మా దగ్గర బంధువులలో ఒకరు, ప్రొమోషన్ వచ్చి తిరుపతి వేసినట్టు, మంచి దర్శనం ఇప్పిస్తాను రండి అని పిలిచారు. ఆరోజు రాత్రివరకు, నేను మా ఆయన, తిరుపతి గురించి మేమిద్దరం మనసులో అనుకున్నా మాటల గురించి చెప్పుకోనేలేదు. ఆయన అలా పిలవగానే, " హమ్మో దేముడు మనల్ని పిలుస్తున్నాడు" అని అనుకున్నాముకానీ మళ్ళీ మా పంతానికి పోయాము. వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము. ఇంతలోనే, మా ఆయన స్నేహితుడు మద్రాస్ (చెన్నై) లో కాన్సెర్ ట్రీట్మెంట్ కి వెళ్లి కోమాలో వున్నట్టు ఒక వార్త వచ్చింది. అంతే కాదు, చాలా ఏళ్ళ క్రితం, మా పక్కింట్లో వుండి వెళ్ళిన తమిళ్ ఫ్యామిలీ ఒకరు విశాఖపట్నం ఏదో పని మీద వచ్చి, నన్ను, మా వారినీ చెన్నై రమ్మని పిలిచారు. అలానే వస్తాములెండి అనేసాము. అలా కాదని, మా ముగ్గురికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసారు వాళ్ళ డబ్బులతోనే. వాళ్ళతోనే మమ్మల్నీ తీసుకుని వెళ్ళారు. అక్కడకి వెళ్ళాకా, మా ఆయనతో కావలిసిన కొన్ని సలహాలు తీసుకుని, వాళ్లకి తిరుపతి మొక్కు ఉందనీ, వాళ్ళు ఒక వాన్ తీసుకుని వెళ్తున్నామని, మమ్మల్ని కూడా ఆ వాన్ లో తీసుకుని వెళ్ళారు. మేము రామని ఎంత చెప్పినా వినకుండా, వాన్ ఖాళీగా వుందని, తప్పకుండా రావాలని, బలవంతం గా, అలా అనే కన్నా చాలా బ్రతిమలాడి తీసుకుని వెళ్ళారు. అంతగా బ్రతిమలాడుతుంటే వెళ్ళకుండా ఎలా వుంటాము? పులిహోర దద్దోజనం ప్యాక్ చేసి పిక్నిక్ లా బయలు దేరాము.
దారిలో మా బంధువు గురించి గుర్తుకు వచ్చి మా ఆయన ఒకసారి ఫోన్ బూత్ దగ్గర ఆపి ఆయనకి ఫోన్ చెస్తే, మా కోసం ఒక మనిషిని మాతో పంపుతానని చెప్పారు. మేము అతనిని చాలా తేలిగ్గా తీసుకున్నాము. డ్రైవర్ మమ్మల్ని అలిపిరి దగ్గర దింపేసి కొండ మీదకి వాన్ పట్టుకుని వెళ్ళాడు. మేము కొండ మీదకి నడుచుకుని వెళ్ళాము. అక్కడ చేరుకున్నాకా, మా దూరపు బంధువు ఏర్పాటు చేసిన కాటేజ్ దగ్గరికి మేము వాన్ లో వెళ్ళిపోయాము. అ కాటేజ్ లో మూడు బెడ్ రూంస్ వున్నాయి. చక్కని ఫర్నిచర్ తో ఒక శిఖరాగ్రం పైన వుంది. తరవాత తెలిసిన విషయం ఎమిటంటే, అది కేవలం డెప్యూటీ చైర్మన్ కి ఇష్టమైన కాటేజ్ ట. కాటేజ్ లో వాళ్ళు కుర్చీలో కూర్చుని చూస్తే తిరుపతి అంత ఒక సముద్రం లో నగరం లా కనిపిస్తుంది.
మా ఆయన మాత్రం, పాద ధూళి దర్హ్సనం అంటూ బయలు దేరారు. ఈలోగా,ఆయన కోసం మా బంధువు పంపిన ఒక వ్యక్తి ఆయనని తిన్నగా గుడిలోనికి తీసుకుని వెళ్ళాడు.. ఆయనను లోనికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి గురించి చెప్పక పోతే, ఈ రాసిన దంతా వ్యర్ధమే. అతనొక ముస్లిం మతస్తుడు. అతను పుట్టినప్పటి నుంచి తిరుపతిలోనే ఉన్నాడుట. అతనికి సుప్రభాతం తో పాటు, గోవింద నామాలు, విష్ణు సహస్ర నామం వంటివి చాలా వచ్చుట. దారి పొడుగునా, వెంకటేశ్వర వైభవాన్ని ఆయనకి వర్ణించి చెప్పాడుట. దగ్గర వుండి, దర్శనం తో బాటు ప్రత్యేక హారతి ఇప్పించి, ఆయనని కాటేజ్ దగ్గర వదిలి వెళ్ళాడు. మర్నాడు పొద్దున్నే, వాళ్ళందరితో, అంగ ప్రదక్షిణ చేసి, మళ్ళీ ప్రత్యేక దర్శనం చేసుకుని మా 'అరవ' స్నేహితులతో చెన్నై తిరిగి వెళ్ళాము.

ఇది జరిగి పన్నెండు ఏళ్ళు అయింది. ఆ తరువాత మరో నెలకే అమెరికా వచ్చేసాము. తిరిగి తిరుపతి కాదు కదా, ఇండియా కూడా వెళ్ళలేదు. దేముడు ఆ విధంగా మాకు బుద్ధి చెప్పాడా అనిపిస్తుంది నాకు.
దేముని మహిమని అలా పరీక్షించినందుకు రోజూ క్షమించమని 'పడా పడా " చెంపలు వాయిన్చుకోవడం తప్ప ఏమి చెయ్యగలను? మీనాక్షి టెంపుల్ కి వెళ్ళినా, న్యూ జెర్సీ లో బ్రిడ్జి వాటర్ టెంపుల్ కి వెళ్ళినా, తిరుపతి వెళ్లినట్టు ఫీల్ అవుతూ ఉంటా.
“ఇందుగల డందు లేడని సందేహము వలదు,.. అనుకుంటూ, నా ఇంట్లోనే దేముని విగ్రహాలు చూసుకుని మురిసి పోతున్నా, అంతకన్నా చేసేదేముంది?

“నీ కొండకు నీవే రప్పించుకో అని సవాలు విసిరిన నాకు, బలవంతంగా, నా ప్రమేయం ఎటువంటిదీ లేకుండా, నా ఖర్చులెకుండా, నా ప్రయత్నం లేకుండా, ఇంత అద్భుతమైన కాటేజీ ఇచ్చి ఇటువంటి దర్శనం ఇచ్చి,నన్ను తరింప జేసెవు కదా స్వామీ “ అని మా వారికి వళ్ళంతా జలదరించి కళ్ళు చెమర్చేయి.

************************************************************

దిగువున వున్న బాలమురళీ కృష్ణ గారి గురించి ఈనాడు పేపర్ లో ఆగష్టు 28 2010 పడిన వార్త. నేను జూలై 19 2010 న బ్లాగులో రాసాను.

Sunday, July 4, 2010

సిని "మా లోకం"

నాకు తెలుసు, సినిమా అనగానే అందరికీ కుతూహలమే మరి. ఏ దేశంలోనైన చవగ్గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా కాక మరేమిటి వుంటుంది చెప్పండి. అందరికీ అందుబాటులో వుండే ఎంటర్ టైన్మెంట్. మరి దాని గురించి కొద్దిగా మాట్లాడాలని అనిపించింది.
చిన్నప్పుడు రోజూ సినిమాకి తీసుకుని వెళ్ళమని గొడవ చేసేదాన్నో ఏమో, మా చిన్నాన్న గారి అబ్బాయి నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళే వాడుట. చిన్న వూరు కావడం వలన, వాడి ఫ్రెండ్ సినిమా హాల్ మేనేజర్ వలనా, రోజూ ఓ గంట సేపు సినిమా చూసాకా, నేను నిద్రపోతే వాడు మళ్ళీ నన్ను మోసుకుని తెచ్చి పడుకో పెట్టేవాడుట. మరి నేను ఎందుకు అల్లరి పెట్టేదాన్నో తెలియదు కాని, నాకు బాగా అర్ధం అయిన సినిమా లవకుశ. నాకు పదేళ్ళు వున్నప్పుడు వచ్చి వుంటుంది. ఆ తరవాతే, కొంచం సినిమా అంతే ఏమిటో తెలిసింది. చదువని చెప్పి మా వాళ్ళు నా సినిమాలు తగ్గించేసారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు ప్రతీ సారీ ఒక సినిమా చూడ నిచ్చేవారు. అంతే. అంటే ఎడాదికి మూడు సినిమాలు మాత్రమే. ఈ లోగా సినిమాలు బంద్. వేసవి సెలవుల్లో తాతగారి వూరు వెళ్ళేవాళ్ళం. అక్కడ సినిమా హాలు లేక పోవడం వలన, చూడడానికి కుదేరేది కాదు.

చాలా కాలం వరకూ, ఏ సినిమా అయినా బాగున్నట్టే అనిపించేది. అమ్మ వాళ్ళు, ఈ సినిమా బాగుంది ఆ సినిమా బాగోలేదు అంటే, ఏమిటో చాలా కాలం అర్ధం కాలేదు నాకు. నా మటుకు నాకు అన్ని సినిమాలూ బాగున్నట్టే అనిపించేది చాలా కాలం వరకూ.
ఆదుర్తి సుబ్బారావు సినిమాలూ బాగుంటాయి అనే వారు. అప్పట్లో నాకైతే విఠలాచార్య సినిమాలు చాలా నచ్చేవి. మనుషులు చిలకలుగానో, కుక్కలు గానో మారి పోవడం అదీ చాలా ఇష్టం గా వుండేది. మంగమ్మ శపథం , శ్రీ కృష్ణ పాండవీయం లాంటి సినిమాలు చాలా నచ్చేవి. చెప్పాలంటే, చూసే ఏడాదికి మూడు సినిమాలు మరువలేనివిగా అనిపించేవి.

ఇక కాలేజీ లెవెల్ కి వచ్చాకా, నా సినిమాలు గురించి పెద్దగా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అన్నయ్య కి వుద్యోగం వచ్చేయడం తో, నాకు సినిమాలకి డబ్బులు బాగానే ఇచ్చేవాడు. అప్పటినుంచి కొంచం ఎక్కువ అయ్యాయి సినిమాలు. తెలుగు కన్నా ఫ్రెండ్స్ తో హిందీ సినిమాలు చూడడం మొదలుపెట్టా. ఇప్పటి నా భర్త, అప్పుడు మా స్నేహితుడిగా వుండేవారు. నాకు హిందీ రాదని, నా పక్కన కూర్చుని, నాకు తెలియని చోట చెబుతానని అనేవారు. సరే ననే దాన్ని. నాకు చాలా డైలాగ్స్ అర్ధం అయ్యేవి. ఎక్కడైనా ఏదైనా పదం అర్ధం కాక, అడిగితే, "ఏమో, నాకూ తెలియదు" అనేవారు సేరియాస్ గా మొహం పెట్టుకుని. పెళ్ళయ్యాకా మరో సమస్య ఎదురయింది నాకు. ఆయన సినిమా చూస్తున్నంత సేపూ కెమెరా ఎక్కడ వుంటుంది, లైట్ బాయ్ ఎక్కడ ఉంటాడు, హీరో హీరోయిన్లు ఏకాంతంలో మాంచి రసవత్తరంగా పాట పాడుతూ వుంటే, వాళ్ళ ముందు ఎంత మంది టెక్నీషియన్లు ఉంటారో, నాకు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ వుంటారు, మొత్తం సినిమా మీద ఇంట్రెస్ట్ చచ్చేటట్టు. చిన్నప్పుడు సినిమాల్లో ట్రాజిడీలు చూస్తున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసేవి. కళ్ళు మిటకరిస్తూ, ఎటో చూస్తున్నాట్టు నటిస్తూ ఎవరూ చూడ కుండా కళ్ళు తుడుచు కునే దాన్ని. సినిమా హాల్లో సౌండ్ చాలా ఎక్కువగా అనిపించి చెవుల్లో వేళ్ళు పెట్టుకునేదాన్ని. దెయ్యం సినిమాలు చూస్తే, చాలా రోజులు భయంకరమైన కలలు వచ్చి, జడుసుకునే దాన్ని. నిద్దట్లోనే హనుమాన్ చాలీసా చదువుకునేదాన్ని. టీ వీ వచ్చాకా, కొంచం ఇమ్మ్యున్ అయ్యానో ఏమో మరి, అలాంటి సున్నితమైన భావాలు చచ్చిపోయాయనుకుంటా. ఇప్పుడు కళ్ళమ్మట నీళ్ళు రావడం లేదు. పైగా పక్కనుంచి ఆయన కామెంటరీ కూడా వుంటుంది కదా.

నాకు బాపు గారంటే చాలా ఇష్టం. నాకు తెలుసు, బాపు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు వుంటారు అని అనుకుంటున్నారు కదూ. ఆయన బొమ్మలు చాలా ఇష్టం కానీ, ఆయన సినిమా ముగింపులు నచ్చేవి కావు. ఆఖరి సీన్ లో వెనకనుంచి పోలీసులు రావడం, గాభరా గాభరాగా విలన్ తాను చేసిన అన్ని వెధవ పనులూ చెప్పెయ్యడం, హీరో హీరోయిన్ లో గోడ పక్కనుంచి వినేసి అపార్ధాలు పోయి కలుసు కోవడం.. ఏమిటో.. అసంతృప్తి గా వుండేది. సినిమా అంతా ఒకెత్తుగా వుంటే, ఆ ఎండింగ్ అంతా తేలి పోయినట్టు అనిపించేది. 'ముత్యాలముగ్గు' కానీండి, లేక 'పెళ్లి పుస్తకం' కానీండి.. ఇక 'సుందర కాండ' అయితే, ఒక ఇంగ్లీష్ సినిమాకి (What a girl wants) మక్కీకి మక్కీ కాక పోయినా, అదిమాత్రం కాపీ. చాలా సినిమాలు మాత్రం నచ్చేవి. విశ్వనాథ్ గారి సినిమాలు చాలా నచ్చేవి, కానీ చాలా మటుకు దు:ఖాంతాలే.

చిన్న మావయ్య పెద్ద మావయ్యకి తెలియకుండా మాకు, అంటే నాకు మా అన్నయ్యకీ ఇంగ్లీష్ సినిమాలు చూపించేవాడు. మాకు అర్ధం కాక పోయినా వెళ్ళడం మానేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటి ఇంగ్లీష్ సినిమాలు చూడడం గొప్ప, రెండవది, ఇవి నా సంవత్సరానికీ మూడు సినిమా కోటా లోంచి కాదు. అందుకే, అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నమాట. 'Hatari', ' A man from Rio', Gold finger', Tora Tora Tora' లాంటివి చూపించాడు. నిజం చెప్పొద్దూ, ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అమెరికా కి వచ్చిన రెండు మూడేళ్ళ తరవాత ఇంగ్లీష్ సినిమాలు ప్రతి డైలాగూ అర్ధం అవడం మొదలయింది. ఈ లోగా, కేబుల్ పెట్టుకోకుండా, ఇంగ్లీష్ టీ వి చూడడం వలన అని అనుకుంటున్నా. ఏదైతేనేం , ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒకే స్థాయిలో ఆనందించ గలుగుతున్నాము.
ఒకసారి ఏమయింది అంటే, మా అయన, చాలా కాలం దేశాంతరం వెళ్లి, వస్తూ, ముంబాయ్ ఆఫీసు పని పూర్తి చేసుకుని, ట్రైన్ దిగి విశాఖ పట్నం లో తెల్లవారు ఝామున ట్రైన్ దిగి, ఆటో దొరక్క, రిక్షా ఎక్కి వస్తూ, ఆ రిక్షా వాడిని, " ఏమోయ్, వూళ్ళో మంచి సినిమాలు ఏమున్నాయి? " అని అడిగారు.
"మాంచి సినిమా వుంది బాబు. శంకరా భరణం తరవాత అలాంటి సినిమా" అన్నాడు రిక్షావాడు.
"ఓహో, ఏమిటా సినిమా" అన్నారు.
వాడు తడుముకో కుండా " కె డి నంబర్ వన్" అన్నాడు.
మా ఆయనకి తల దిమ్మెక్కి పోయింది. ఒక్క సారి జ్ఞానోదయం అయింది. అవును.. ఎందుకు కాకూడదూ? రెండు సినిమాలకీ వసూళ్లు బహుశా ఒకటే అయి వుంటాయి కదా మరి. అనుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సినిమా లోనూ ఏదో ఒక మంచి చూడ డానికి ప్రయత్నించడం మొదలు పెట్టాము. ఆలీ, బ్రహ్మానందం హీరో లు గా వేసిన సినిమాలు కూడా నచ్చేయ్యడం మొదలు పెట్టాయి.
అంతే కాదు, ఎస్ ఎస్ ఎల్ సి లో స్కూల్ లో ఫస్ట్ వచ్చిన మా బంధువుల్లో ఒకనికి ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్ పోటీలలో పియు సి పరీక్షలు పోగుట్టుకున్న వారిని కూడా చూసాము. కొందరు సినిమా హీరోలకి అభిమాన సంఘాలు కూడా ఉంటాయని చాలా రోజుల వరకూ నాకైతే తెలియదు. నిజం చెప్పొద్దూ, మా ఆయనకి కొంచం ఎన్ టీ ఆర్ ఫ్యాన్. మిగతా వాళ్ళు ఇతర నటుల పేరు చెబితే చాలు, ఆయనకి ఇప్పటికీ ఉద్రేక౦ వస్తుంది వాగ్యుద్దానికి దిగి పోతారు. మా అక్క కొడుకు చిన్నప్పుడు "ఎన్ టీ ఆర్ వద్దిల్లారి ' అనే వాడు, వర్ధిల్లాలి అందడం పలకక. ఈ వయస్సులో కూడా ఈ తగవులు పోలేదు. ఈ మధ్యనే ఒక సినీ నటుడు ' కృష్ణ అభిమాని, తెలియ చేసిన కొత్త విషయం ఏమిటంటే, కృష్ణ ఎందుకు ప్రతీ ఏటా అన్నేసి సినిమాలలో నటిస్తారు అని అడిగితే, చాలా మందికి ఉద్యోగావకాశాలు కలిగించాలని అని చెప్పాడుట. నిజమే కదా. ఆయన నటించక పొతే, మరి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు?
కేబుల్ టీ వీ లో రోజుకు మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సినిమా అంతే ఇంట్రెస్ట్ చచ్చి పోయింది. అయినా ఏదో డ్యూటి లాగా చూసేస్తున్నా. నేను టీ వీ లో పాత సినిమాలు చూస్తూ వుంటే, మా అబ్బాయి వచ్చి అబ్బా బ్లాక్ అండ్ వైట్ సినిమా వా అంటూ మరో గదిలోకి వెళ్లి పోతాడు. వాడికేమి తెలుసు ఆ సినిమాల విలువ అనుకుంటూ ఉంటా.
భగవద్ గీతలో సుఖ దుఖాలకి అతీతం గా వున్నట్టు, అన్ని సినిమాలని ఒకే విధంగా చూడాలని చాలా ప్రయత్నించా.. కానీ కుదరడం లేదు. అలా అని మంచి డైరెక్టర్ అని సినిమాలు ఎంచుకోవడం మొదలు పెట్టా. అలా అని ఈ మధ్య మణిరత్నం 'రావణ్' చూసి పడా పడా చెంపలు వాయి౦చుకున్నా.

అయినా ఒక విషయం మాత్రం బాగా అర్ధం అయింది. వెనకటికి ఒకడు, కొందరు బంధువులు వచ్చి ఆనంద పెడతారు, కొందరు వెళ్లి ఆనంద పెడతారు అని. కొన్ని సినిమాలు, హాలులో చూసి ఆనందిస్తాము. కొన్ని, హాలు లోంచి పైకి వచ్చాసాకా ఆనందిస్తాము "బతుకు జీవుడా, వెధవ సినిమా అయిపోయింది" అని. వెనకటికి ఒకడు ఇరుకు బూట్లు వేసుకుని రోజూ ఆఫీసు కి వచ్చేవాడుట. ఒక మిత్రుడు, వాడిని చాలా రోజులు, నానా అవస్థా పడడం చూసి, 'ఎందుకురా అలా బాధ పడుతున్నావు, కొత్త బూట్లు కొనుక్కో వచ్చుగా ? " అని అడిగేడుట, దానికి వాడు, అవి ఇచ్చినప్పుడు ఇచ్చే ఆనందం నా బాధలనీ మర్చి పోయేటట్టు చేస్తుంది' అన్నాడుట. నిజం చెప్పొద్దూ, రావణ్ సినిమా చూసాకా అలానే అనిపించింది. ఈ మధ్య టీ సి ఏ వాళ్ళు ఫ్రీగా "ప్రస్థానం" చూపించారు. కాసేపు సినిమాలో కూర్చుంటే, మమ్మల్ని కూడా ఏ కత్తో పెట్టి చంపేస్తారేమో అనిపించింది. సినిమా బాగోలేదని అనలేము. కానీ ఆ రక్తపాతాలు చూసి, ఆనందించడానికి మనం అంత సాడిష్టులమా అని అనిపిస్తోంది. ఆ రక్తపాతాలు నాకైతే చూడడం కొంచం కష్టం గానే ఉంటోంది.
అంతెందుకూ, డిస్నీ వాళ్ళ టాం అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతూ వుంటే, ఇది కూడా సాడిజం లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి కాదా, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే అదే కదా మరి?

ఒకసారి ఏమయిందంటే, మా వేసవుల్లో తాత గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక లారి పక్కనే వున్న టౌన్ కి వెళ్తున్నట్టు తెలిసింది. ప్రతీ వారం అది సరుకులు పట్టుకుని మా తాతగారి వూరు వచ్చేది. పూర్తిగా మూసివుంటుంది. మేము వెళ్ళి మమ్మల్ని కూడా ఆ వూరు తీసుకుని వెళ్ళమని అడిగాము. వాడు వెంటనే వొప్పుకున్నాడు. తాతగారు బాగా పలుకు బడి వున్నవారు కదా. కానీ ఆయన పొలానికి వెళ్ళిపోయారు. ఇంట్లో అమ్మమ్మ,అత్తయ్యలు, మామయ్యలు వాళ్ళ పిల్లలు పదిహేను మందిమి తయారయ్యాము. తాతగారి పర్మిషన్ కావాలి.మీరు వంట చేసెయ్యండి, మేము తాత గారిని అడిగి వస్తామని నేను, నా కజిన్ రత్నాన్ని వెంట పెట్టుకుని పొలానికి బయలు దేరాను. తూనీగల్లా పరిగెత్తి, మనసులో గాలిలో ఎగురుతూ పొలానికి చేరుకున్నాము. తాతగారు, పాలిగాపులతో దగ్గరుండి, మొక్కలకి గొప్పులు తవ్వించడం, కలుపులు తీయించడం లాంటి పనులు చేయిస్తున్నారు. మేము వెళ్ళి "తాతయ్యా, లారి వాడు తీసుకుని వెళ్తున్నాడు, ప్లీజ్, సినిమాకి పంపవా అని గారాలు పోయాము. ఏ కళ నున్నాడో, వెంటనే వప్పేసుకున్నాడు. వెంటనే పరిగెట్టుకుని పారిపోయాము, మళ్ళీ మనసు మార్చేసుకుంటాడేమో నని భయంతో. మేము వెళ్ళిన మరో పది నిముషలకే లారీ ఎక్కి వెళ్ళిపోయాము. దసరా బుల్లోడు కాక మరో సినిమా చూసి, రాత్రికి ఆ వూళ్ళోనే వుద్యోగం చేస్తున్న మా దూరపు బంధువుల ఇంట్లో పడుకుని మర్నాడు తాత గారి ఇంటికి చేరుకున్నాము. తాతగారు చాలా కోపంగా కనిపించారు. మింగలేక కక్కలేకా వున్నట్టు కనిపించారు. కారణం ఎమిటో మాకు అర్ధం కాలేదు. తరవాత తెలిసిందేమిటంటే, నేను, రత్నం మాత్రమే సినిమా కి వెళ్తున్నామని అనుకున్నారు ఆయన. ఆయన పెర్మిషన్ ఇచ్చింది మా ఇద్దరికేట. ఏదయితేనేమి, అందరం అలా లారీలో వెళ్ళడం, ఆ రోజు మేము పట్టుకుని వెళ్ళిన చింతకాయ పచ్చడి, పప్పుపులుసు అన్నం రుచి ఇంకా నా మనస్సులో మెదులుతూనే వుంటుంది. ఇప్పటికీ ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ వుంటాము.