Monday, July 19, 2010

నీ కొండకు నీవే రప్పించుకో !

ఇందుగలడందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూసిన, అందందే గలడు, దానావాగ్రిణి వింటే.
ఎంత అందంగా, ఎంత సులభంగా,చెప్పెసాడో కదా ప్రహ్లాదుడు? ఎక్కడ బడితే, అక్కడే దొరుకుతున్న ఆ దేముని కోసం, మనం ఇంట్లోనే కూర్చుని ప్రార్ధించు కో వచ్చు కదా? ఈ మధ్య మురళి గారి తేటగీతి లో "పుణ్యం కావాలా, ఐతే" ( http://tetageeti.wordpress.com/2010/07/16/punyam_kaavaalaa/) చదివేకా, నా జీవితంలోని ఈ అనుభవం గురించి రాయాలని మరీ మరీ అనిపించింది.
ఒకసారి మా అబ్బాయికి హెపిటైటిస్ బి ఇంజేక్షన్స్ రెండు ఇచ్చాకా, మూడవ ఇంజెక్షన్ కి మరొక నెల టైం వుంది కదా, అని ఈ లోగా, తిరుపతి దర్శనం చేసుకుని రావచ్చని నేను, మా ఆయన, బాబుతో బయలు దేరాము
.
ఎప్పటి లాగానే, మమ్మల్ని వైకుంఠం దగ్గర వదిలెసి, యెవరో పరిచయం లేని యాత్రికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ, వారికి దారి చూపిస్తూ, ఉచిత సలహాలు ఇస్తూ, తను తప్పిపోయి మేమేదో తప్పిపోయి నట్టు మమ్మల్ని వెదుక్కుంటూ కల్యణ కట్ట దగ్గర తేలేరు. అక్కడ, ఆయన ఒక వ్యక్తి వాంతులు చేసుకుంటూ కనిపించాడు. ఈయన, మా సంగతి పూర్తిగా మరచిపోయి, ఆ వ్యక్తిని గమనించి, అతని ఆరోగ్య పరిస్థితి కొంచం సీరియస్ గా అనిపించి, గబగబా, దగ్గరనే వున్న కొందరు వ్యక్తుల సహాయంతో, అశ్వని హాస్పిటల్ కి ఫోన్ చేసి, అంబులెన్సు తెప్పించారు. ఆ హాస్పిటల్ వాళ్ళు మా ఆయన్ని కూడా ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. ఒక గంట అక్కడ వుండి, అతనికి ప్రాణ భయం లేదని నిర్ధరించుకున్న తరవాత, తిరిగి, మాకోసం వెదకడం మొదలు పెట్టారు. మేము ధర్మ దర్శనం కోసం "వైకుంఠం" వెళ్లి ఉంటామని గుర్తుకు వచ్చి, ఎలానో ఓలాగ మమ్మల్ని చేరుకున్నారు,

"హమ్మయ్య వచ్చేసారా" అని గాభరా పడుతున్న నన్ను చూసి, జరిగింది చెప్పారు. "పోనీ లెండి, మంచిపనే చేసారు" అని క్యూ కాంప్లెక్స్ లో చేరాము. అక్కడ ఓ నాలుగు గంటలు ఆ జైలు లో కూర్చున్నాము. .. (భక్తులు క్షమించాలి, జైలు అన్నందుకు. అవి నాకు జైళ్ల లాగే కనిపిస్తాయి. ఒక రకంగా, మనం పూర్వం చేసిన పాపాలకి, ఆ విధంగా దేముడు మనకి ఒక రకంగా శిక్ష వేసి, పాపాలు తగ్గిస్తున్నా డేమో అని పిస్తుంది. అందుకే నేమో, మన పాప భారం కొంచం తగ్గి, దేముడు మనకి కొంచం పుణ్యం ఇస్తాడు.) అంత సేపూ అటు ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్న మా బాబు సడన్ గా, నా దగ్గరికి వచ్చి నా వళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. వళ్ళు కాలిపోతోంది. చాలా జ్వరం వచ్చేసింది. నా బాగ్ తీసి, పారాసెట్ మాల్ టాబ్లెట్ ఒకటి వేసాను. ఎంతకీ జ్వరం తగ్గలేదు. ఎందుకో అనుమానం వచ్చి వాడి కళ్ళు విప్పి చూసాను. కళ్ళు పచ్చగా వున్నాయి. ఆయనకి చూపించి, ఇదేమిటి, మనం రెండు హెపిటైటిస్ బి ఇంజేక్షన్స్ ఇచ్చాము కదా, అయినా కళ్ళు ఎందుకు పచ్చగా ఉన్నాయేమిటి అని అడిగాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఆయన వెంటనే, పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నారు. నాలుగు గంటలు కూర్చున్నాము కదా, మరి రెండు మూడు గంటల్లో వెళ్లి దర్శనం అయిపోతుంది వుండండి, అదే తగ్గి పోతుంది అంటూ చుట్టూ పక్కల వాళ్ళు సలహా ఇచ్చారు. మా అయన, మమ్మల్ని కాంప్లెక్స్ లో బంధించిన అక్కడి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పారు. వాళ్ళు, ఫరవాలేదు. "మీరు వెళ్ళండి. మేము మీకు స్పెషల్ గా దర్శనం ఇప్పిస్తాము" అని చెప్పారు.
మేము వెంటనే, కాంప్లెక్స్ లోంచి వెళ్లి పోయి అశ్వని హాస్పిటల్ కి వెళ్ళాము. వాళ్ళు మా అబ్బాయిని చెక్ చేసి, " పిల్లవాడికి బాగోలేదు. కొండ మీద వుండకండి, వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి, దర్శనం అయిందా అని అడిగాడు. ఇంటికి వెళ్లిపోతాము, మాకు దర్శనం అక్కర లేదు అని చెప్పాము. కానీ, ఆ డాక్టర్ " అలా చెయ్యకండి.. తరవాత, మీకు మనసులో చాలా పీకుతూ వుండి పోతుంది. కనుక స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి" అన్నాడు". వైకుంఠం దగ్గరకు వెళ్ళగానే, మమ్మల్ని బయటికి వదిలిన వ్యక్తి మమ్మల్ని గుర్తుపట్టి, లోపలికి డైరెక్ట్ గా వెళ్తున్న వాళ్ళలో కలిపి గుడి లోనికి పంపాడు.. మేము స్వామి వారి దర్శనం చేసుకుని, వెంటనే, కొండదిగి విశాఖపట్నం చేరుకున్నాము. భగవంతుని దయవల్ల మా వాడు కూడా బాగానే వున్నాడు.
కానీ, మనస్సులో అనుకున్నాను.. నా భర్త కానీ, నా కొడుకు కాని, ఒక పెద్ద పదవి లోకి వెళ్లి, మాకు తిరుపతిలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు జరిగితేనే కానీ మళ్ళీ తిరుపతి వెళ్ల కూడదు అని నా మనస్సులో అనిపించేసింది. అంతే ఆయన వుండడం పెద్ద పదవి లోనే వున్నారు, ఎటొచ్చీ గవర్నమెంట్ లో కాదు ప్రైవేటు సెక్టార్ లో. . అలానే, ఆయనకి కూడా, "నీ కొండకు నీవే రప్పించుకో , నేను ప్రయత్నం చెయ్యను" అని మనస్సులో గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.
ఇది జరిగి రెండు నెలలు కాలేదు, మా దగ్గర బంధువులలో ఒకరు, ప్రొమోషన్ వచ్చి తిరుపతి వేసినట్టు, మంచి దర్శనం ఇప్పిస్తాను రండి అని పిలిచారు. ఆరోజు రాత్రివరకు, నేను మా ఆయన, తిరుపతి గురించి మేమిద్దరం మనసులో అనుకున్నా మాటల గురించి చెప్పుకోనేలేదు. ఆయన అలా పిలవగానే, " హమ్మో దేముడు మనల్ని పిలుస్తున్నాడు" అని అనుకున్నాముకానీ మళ్ళీ మా పంతానికి పోయాము. వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము. ఇంతలోనే, మా ఆయన స్నేహితుడు మద్రాస్ (చెన్నై) లో కాన్సెర్ ట్రీట్మెంట్ కి వెళ్లి కోమాలో వున్నట్టు ఒక వార్త వచ్చింది. అంతే కాదు, చాలా ఏళ్ళ క్రితం, మా పక్కింట్లో వుండి వెళ్ళిన తమిళ్ ఫ్యామిలీ ఒకరు విశాఖపట్నం ఏదో పని మీద వచ్చి, నన్ను, మా వారినీ చెన్నై రమ్మని పిలిచారు. అలానే వస్తాములెండి అనేసాము. అలా కాదని, మా ముగ్గురికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసారు వాళ్ళ డబ్బులతోనే. వాళ్ళతోనే మమ్మల్నీ తీసుకుని వెళ్ళారు. అక్కడకి వెళ్ళాకా, మా ఆయనతో కావలిసిన కొన్ని సలహాలు తీసుకుని, వాళ్లకి తిరుపతి మొక్కు ఉందనీ, వాళ్ళు ఒక వాన్ తీసుకుని వెళ్తున్నామని, మమ్మల్ని కూడా ఆ వాన్ లో తీసుకుని వెళ్ళారు. మేము రామని ఎంత చెప్పినా వినకుండా, వాన్ ఖాళీగా వుందని, తప్పకుండా రావాలని, బలవంతం గా, అలా అనే కన్నా చాలా బ్రతిమలాడి తీసుకుని వెళ్ళారు. అంతగా బ్రతిమలాడుతుంటే వెళ్ళకుండా ఎలా వుంటాము? పులిహోర దద్దోజనం ప్యాక్ చేసి పిక్నిక్ లా బయలు దేరాము.
దారిలో మా బంధువు గురించి గుర్తుకు వచ్చి మా ఆయన ఒకసారి ఫోన్ బూత్ దగ్గర ఆపి ఆయనకి ఫోన్ చెస్తే, మా కోసం ఒక మనిషిని మాతో పంపుతానని చెప్పారు. మేము అతనిని చాలా తేలిగ్గా తీసుకున్నాము. డ్రైవర్ మమ్మల్ని అలిపిరి దగ్గర దింపేసి కొండ మీదకి వాన్ పట్టుకుని వెళ్ళాడు. మేము కొండ మీదకి నడుచుకుని వెళ్ళాము. అక్కడ చేరుకున్నాకా, మా దూరపు బంధువు ఏర్పాటు చేసిన కాటేజ్ దగ్గరికి మేము వాన్ లో వెళ్ళిపోయాము. అ కాటేజ్ లో మూడు బెడ్ రూంస్ వున్నాయి. చక్కని ఫర్నిచర్ తో ఒక శిఖరాగ్రం పైన వుంది. తరవాత తెలిసిన విషయం ఎమిటంటే, అది కేవలం డెప్యూటీ చైర్మన్ కి ఇష్టమైన కాటేజ్ ట. కాటేజ్ లో వాళ్ళు కుర్చీలో కూర్చుని చూస్తే తిరుపతి అంత ఒక సముద్రం లో నగరం లా కనిపిస్తుంది.
మా ఆయన మాత్రం, పాద ధూళి దర్హ్సనం అంటూ బయలు దేరారు. ఈలోగా,ఆయన కోసం మా బంధువు పంపిన ఒక వ్యక్తి ఆయనని తిన్నగా గుడిలోనికి తీసుకుని వెళ్ళాడు.. ఆయనను లోనికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి గురించి చెప్పక పోతే, ఈ రాసిన దంతా వ్యర్ధమే. అతనొక ముస్లిం మతస్తుడు. అతను పుట్టినప్పటి నుంచి తిరుపతిలోనే ఉన్నాడుట. అతనికి సుప్రభాతం తో పాటు, గోవింద నామాలు, విష్ణు సహస్ర నామం వంటివి చాలా వచ్చుట. దారి పొడుగునా, వెంకటేశ్వర వైభవాన్ని ఆయనకి వర్ణించి చెప్పాడుట. దగ్గర వుండి, దర్శనం తో బాటు ప్రత్యేక హారతి ఇప్పించి, ఆయనని కాటేజ్ దగ్గర వదిలి వెళ్ళాడు. మర్నాడు పొద్దున్నే, వాళ్ళందరితో, అంగ ప్రదక్షిణ చేసి, మళ్ళీ ప్రత్యేక దర్శనం చేసుకుని మా 'అరవ' స్నేహితులతో చెన్నై తిరిగి వెళ్ళాము.

ఇది జరిగి పన్నెండు ఏళ్ళు అయింది. ఆ తరువాత మరో నెలకే అమెరికా వచ్చేసాము. తిరిగి తిరుపతి కాదు కదా, ఇండియా కూడా వెళ్ళలేదు. దేముడు ఆ విధంగా మాకు బుద్ధి చెప్పాడా అనిపిస్తుంది నాకు.
దేముని మహిమని అలా పరీక్షించినందుకు రోజూ క్షమించమని 'పడా పడా " చెంపలు వాయిన్చుకోవడం తప్ప ఏమి చెయ్యగలను? మీనాక్షి టెంపుల్ కి వెళ్ళినా, న్యూ జెర్సీ లో బ్రిడ్జి వాటర్ టెంపుల్ కి వెళ్ళినా, తిరుపతి వెళ్లినట్టు ఫీల్ అవుతూ ఉంటా.
“ఇందుగల డందు లేడని సందేహము వలదు,.. అనుకుంటూ, నా ఇంట్లోనే దేముని విగ్రహాలు చూసుకుని మురిసి పోతున్నా, అంతకన్నా చేసేదేముంది?

“నీ కొండకు నీవే రప్పించుకో అని సవాలు విసిరిన నాకు, బలవంతంగా, నా ప్రమేయం ఎటువంటిదీ లేకుండా, నా ఖర్చులెకుండా, నా ప్రయత్నం లేకుండా, ఇంత అద్భుతమైన కాటేజీ ఇచ్చి ఇటువంటి దర్శనం ఇచ్చి,నన్ను తరింప జేసెవు కదా స్వామీ “ అని మా వారికి వళ్ళంతా జలదరించి కళ్ళు చెమర్చేయి.

************************************************************

దిగువున వున్న బాలమురళీ కృష్ణ గారి గురించి ఈనాడు పేపర్ లో ఆగష్టు 28 2010 పడిన వార్త. నేను జూలై 19 2010 న బ్లాగులో రాసాను.

2 comments:

  1. పద్మగారూ,
    ప్రపంచమంతా కలియచూసిన మీఅనుభవాలని ఇలా పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. వియత్నాం, పేరిస్ కథనం మనసు చలింపచేసే విధంగా రాసారు.

    కాకపోతే Brain Freeze కి బదులుగా ఇంకేదైనా తెలుగు పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.

    ReplyDelete
  2. అసంఖ్యా గారు,
    మీ కోరిక మేరకు తెలుగు పేరు పెట్టా, మీకు నచ్చుతుందని భావిస్తాను.
    చెల్లాయి.

    ReplyDelete